పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ అర్థరాత్రి సమావేశాలు ఎన్నిసార్లు?

29 Jun, 2017 16:56 IST|Sakshi
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ అర్థరాత్రి సమావేశాలు ఎన్నిసార్లు?

న్యూఢిల్లీ:   జూన్‌ 30 అర్థరాత్రిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జీఎస్‌టీ సంబరాలకు  ప్రతి పక్షాలు డుమ్మాకొట్టనున్న సంగతి విదితమే.   కాంగ్రెస్‌,  తృణమూల్‌, డీఎంకే జీఎస్‌టీ లాంచింగ్‌ సమావేశాన్ని బాయ్‌ కాట్‌ చేస్తూ  నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గురువారం ఢిల్లీలో గురువారం  ప్రెస్‌మీట్‌ నిర్వహించాయి.  ఈ సమావేశంలో కాంగ్రెస్‌    సీనియర్‌ నాయకులు గులాం నబీ అజాద్‌ మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న జీఎస్‌టీ తీరు తెన్నులపై ఆరోపణలు చేశారు.  
ముఖ‍్యంగా జీఎస్‌టీ  లాంచింగ్‌ కార్యక్రమ్రాన్ని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో అర్థరాత్రి నిర్వహించడంపై అభ్యంతరంపై వ్యక్తం  చేశారు. దేశ చరిత్రలో మూడే మూడుసార్లు  పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ అర్థరాత్రి సమావేశాలు జరిగాయని గులాం నబీ అజాద్‌ చెప్పారు.   ముందుగా దేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర‍్బంగా 1947  ఆగస్టులో 15 అర్థరాత్రి  పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో సమావేశమైనట్టు చెప్పారు. అలాగే  సిల్వర్‌ జూబ్లీ  ఉత్సవాల సందర్భంగా 1972 సం.రంలోనూ, గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల సంద‍ర్భంగా 1997లో మాత్రమే  జరిగాయన్నారు.

పేదలు, మహిళలు, అల్ప సంఖ్యాక వర్గాలు, దళితుల సంక్షేమాన్ని బీజేపీ పక్కన పెట్టిందని ఆరోపించారు.  దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి పట్టించుకోవడంలేదన్నారు.  క్షీణిస్తున్న జీడీపీపై  ధ్యాస లేదని మండిపడ్డారు.   ఈసందర్భంగా జీఎస్‌టీకి వ్యతిరేకంగా సాగుతున్న  ఉద్యమాలపై సంతోషం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా కాంగ్రెస్‌ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని మెజారీటీ ప్రజానీకం ఆకాంక్షల్ని పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో  తాము జీఎస్‌టీ లాంచింగ్‌ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆయన  వెల్లడించారు.


కాగా బీజేపీ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా   భావిస్తున్న  జీఎస్‌టీ ని  జూలై 1 నుంచి అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 30న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక సమావేశం ద్వారా జీఎస్‌టీని అధికారికంగా లాంచ్‌ చేయనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి  అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. దీనికి  ప్రధానమంత్రి,  ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి,  స్పీకర్‌ సహా ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారుని తెలిపారు.  వీరితోపాటు మాజీ ప్రధానులను కూడా ఆహ్వానించినట్టు   జైట్లీ  కటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు జీఎస్‌టీ లాంచింగ్‌ వేడుకలకు సర్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ ఆదియా  ప్రకటించారు. జీఎస్టీ అమలుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు