కాంగ్రెస్‌కు మూడు స్థానాలు కూడా దక్కవు: జవదేకర్

13 May, 2014 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో గత లోక్‌సభ ఎన్నికల్లో 33 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు ఈ సారి మూడు స్థానాలు కూడా దక్కవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని, తెలంగాణలో బీజేపీ-టీడీపీ కూటమికి మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ ఫలితాలు చూస్తే గాలి ఎటువైపు ఉందో తెలుస్తుందన్నారు. సోమవారం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌తో కలసి జవదేకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఇది ఎగ్జిట్ పోల్ కాదు. ఎగ్జాట్ పోల్.

16న వెలువడనున్న ఫలితాల్లో సీమాంధ్ర, తెలంగాణలో లోక్‌సభ స్థానాలన్నీ గెలుస్తాం. చంద్రబాబు నేతృత్వాన్ని అభినందిస్తున్నా’ అన్నారు. ఎన్డీఏ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి అనుమానాలు లేవని, కలసి నడుస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. సీఎం రమేశ్ మాట్లాడుతూ.. స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మున్సిపల్ కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. టీడీపీ-బీజేపీపై నమ్మకంతోనే గెలిపించారని చెప్పారు. మోడీ, పవన్ ప్రచారం, చంద్రబాబు పథకాలు తమకు లాభిస్తాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు బీజేపీతో మేలు జరగబోతోందన్నారు.
 

>
మరిన్ని వార్తలు