రాహుల్‌పై ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

15 Nov, 2018 11:16 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : స్వాతంత్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. రాహుల్‌ తప్పుడు ప్రకటన చేశారంటూ సావర్కర్‌ కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలక బీజేపీ కొనియాడే వీర్‌ సావర్కర్‌ గతంలో తనను జైలు నుంచి విడుదల చేయాలని బ్రిటిషర్ల కాళ్లు మొక్కారని రాహుల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన రాహుల్‌ వీర్‌ సావర్కర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్ధార్‌ పటేల్‌ వంటి స్వాతంత్ర సమరయోధులు దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గితే వీర్‌ సావర్కర్‌ తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని, తనను క్షమించి జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ బ్రిటిష్‌ వాళ్లకు మొక్కుతూ లేఖ రాశారని రాహుల్‌ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో వీర్‌సావర్కర్‌ చిత్ర పటం పెట్టారని ఆయన ఎలాంటి త్యాగాలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సావర్కర్‌ మునిమనుమడు రంజిత్‌ సావర్కర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను 27 ఏళ్ల పాటు బ్రిటిష్‌ వారు జైళ్లలో ఉంచారని ఆయన పేర్కొన్నారు. హిందుత్వ నేతపై  రాహుల్‌ తప్పుడు ప్రకటన చేయడం పట్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

మరిన్ని వార్తలు