న్యూఢిల్లీ : ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని కోర్కమిటీ మరికొద్దిసేపట్లో భేటీ కానుంది. షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ కోర్ కమిటీ సాయంత్రం 5.30 గంటలకు భేటీ కావల్సి ఉన్నప్పటికీ చిన్నమార్పు జరిగింది. దాంతో నాలుగు గంటలకు కాంగ్రెస్ వ్యూహ కమిటీ సమావేశం కానుంది. సోనియాతో పాటు ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ పాల్గొంటారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా కొత్తగా నియమితులైన దిగ్విజయ్సింగ్, నిన్నమొన్నటి వరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన గులాంనబీ ఆజాద్లు కూడా పాల్గొంటారు.
అలాగే తీసుకోబోయే నిర్ణయంపై రోడ్మ్యాప్లతో రావలసిందిగా రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఈ భేటీకి ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఈ రోడ్ మ్యాపుల రూపకల్పన విషయంలోనూ కేవలం పార్టీ రాజకీయప్రయోజనాలను మాత్రమే చూసుకొని రూపొందించాలని ముగ్గురు నేతలకు సూచించడం తెలిసిందే. ఈ ముగ్గురి నివేదిక కూడా ఆ దిశగానే ఉన్నట్లు తెలుస్తోంది.