కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ నేత ప్రశంసలు..

9 Feb, 2020 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రదర్శన పేలవంగా ఉంటుందని, దేశ రాజధానిలో ఆప్‌ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఆప్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తుందని, కాంగ్రెస్‌ మూడోస్ధానంతో సరిపెట్టుకుంటుందని అంచనాలు వెల్లడించాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై కాంగ్రెస్‌ నేత స్పందిస్తూ ఢిల్లీ ఎన్నికలపై తాము మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకోలేదని, తమ బలాన్నంతా కూడదీసుకుని ఎన్నికల బరిలో పోరాడామని, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మతతత్వ అజెండాతో ముందుకువస్తే కేజ్రీవాల్‌ అభివృద్ధి అజెండాతో​ముందుకొచ్చారని అన్నారు. కేజ్రీవాల్‌ గెలిస్తే అభివృద్ధి అజెండా గెలుపుగా భావించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను మించి తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జ్‌ పీసీ చాకో ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి : ఢిల్లీ సుల్తాన్ కేజ్రీవాలే..! 

మరిన్ని వార్తలు