సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ పరిణామాలపై చైనా యూటర్న్ తీసుకుని మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నరేంద్ర మోదీ సర్కార్ చోద్యం చూస్తోందని కాంగ్రెస్ మండిపడింది. కశ్మీర్లో పరిణామాలను తాము గమనిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇమ్రాన్తో భేటీ సందర్భంగా అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో సంబంధం లేకుండా చైనా-పాక్ బంధం కొనసాగుతుందని జిన్పింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు, జినియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన, టిబెట్లో అణిచివేత వంటి అంశాలను భారత్ ఎందుకు లేవనెత్తదని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ప్రశ్నించారు. భారత అంతర్గత వ్యవహరాల్లో చైనా జోక్యాన్ని కేంద్రం నియంత్రించడంలో విఫలమవుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం చెన్నైలో చైనా అధ్యక్షుడి భేటీ నేపథ్యంలో జిన్పింగ్ పాక్ అనుకూల వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.