ఐసీఐసీఐ అక్రమాలపై నోరుమెదపరేం..

4 Jun, 2018 19:04 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూడిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల జారీలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి సీఈవో చందా కొచర్‌పై తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై మోదీ సర్కార్‌ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీసింది. ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు బ్యాంక్‌ ఖాతాలపై పర్యవేక్షణ, ఖాతాదారులు, డిపాజిటర్లు, షేర్‌హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన మోదీ సర్కార్‌ తన పెట్టుబడిదారీ స్నేహితులను కాపాడటంలో మునిగితేలుతోందని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల వ్యవహారంలో అక్రమాలపై హెచ్చరిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రధాన మంత్రికి లేఖలు, వార్తలు వెల్లువెత్తిన క్రమంలో ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ అక్రమాలపై మోదీ సర్కార్‌ మౌనం దాల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

బ్యాంకులపై నిఘా కొరవడటంతో రూ 61,036 కోట్ల సొమ్ము రుణాల పేరుతో లూటీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై సాధారణ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు.

మరిన్ని వార్తలు