రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ‘శతకం’

1 Feb, 2019 09:10 IST|Sakshi

తాజా గెలుపుతో వందకు చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు

జైపూర్‌/ చండీగఢ్‌ : రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మరోసారి జయభేరి మోగించింది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి షఫియా జుబేర్‌ 12వేల ఓట్ల మెజారిటీతో గురువారం విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సమీప భాజపా అభ్యర్థి సువంత్‌ సింగ్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యాబలం 100కు పెరిగింది. గతేడాది డిసెంబరు 7న రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేసి తిరిగి జనవరి 27న ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 

జింద్‌...మళ్లీ బీజేపీ వశం  
హరియాణాలో జరిగిన జింద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు,  పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐఎన్‌ఎల్డీ పార్టీకి చెందిన జింద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిచంద్‌ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, ఐఎన్‌ఎల్డీ నుంచి ఉమ్‌ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్‌ చౌతాలా పోటీ చేశారు.  

మరిన్ని వార్తలు