పంజాబ్‌ పంచాయితీ పోరులో కాంగ్రెస్‌ హవా

31 Dec, 2018 17:14 IST|Sakshi
పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

చండీగఢ్‌ : పంజాబ్‌లో ఆదివారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్‌ సత్తా చాటింది. 13,000కు పైగా గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పంచాయితీలను అధికార కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. గెలుపొందిన సర్పంచ్‌లు, పంచాయితీల సభ్యులకు కాంగ్రెస్‌ పార్టీ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ భారతంలో సానుకూల మార్పులకు ఈ ఎన్నికల్లో విజేతలు శ్రీకారం చుట్టాలని కోరింది.

కాగా, పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన వారికి పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడం ద్వారా విజయం సాధించిన కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విపక్ష ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఆరోపించాయి.

ప్రజలకు ఎలాంటి మేలు చేయని కాంగ్రెస్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేక హింసకు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసిందని ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుక్భీర్‌ సింగ్‌ బాదల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బూత్‌లను స్వాధీనం చేసుకుని యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఎస్‌ఏడీ సీనియర్‌ నేత దల్జీత్‌ సింగ్‌ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని విపక్ష నేత, ఆప్‌ సీనియర్‌ నాయకుడు హర్పాల్‌ చీమ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు