సాక్షి, తమిళనాడు: కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో జనాలు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఫోటో జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి.. దాడి చేశారు. తమిళనాడులోని విరూద్నగర్ జిల్లాలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి పెద్దగా జనాలు రాలేదు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి కూడా ఖాళీ కుర్చీలు కనిపించడంతో ఓ తమిళ వార పత్రిక జర్నలిస్టు అయినా ముత్తురాజ్.. ఆ ఖాళీ కుర్చీలను ఫోటో తీశాడు.
ఆది కాంగ్రెస్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. ఖాళీ కుర్చీల ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ.. అతని దగ్గరున్న కెమెరాను లాక్కోడానికి ప్రయత్నించడమే కాకుండా అతనిపై దాడికి దిగబడ్డారు. ఇతర జర్నలిస్టులు కలుగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన జర్నలిస్టు ముత్తురాజ్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ గొడవంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ దాడిని ఖండిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలను గూండాల్లా ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.