లంచగొండ్లు.. యాచకులు ఒక్కటే

8 Dec, 2017 07:22 IST|Sakshi

ఉద్యోగుల పిల్లలకు లగ్జ రీకార్లు ఎలా వస్తున్నాయి?

ఒక కేసు విచారణలో హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వశాఖల్లో నడుస్తున్న బల్ల కింద సంస్కృతిపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెవెన్యూ శాఖలో ని ఆమ్యామ్యాలను ప్రస్తావిస్తూ, లంచాలు దండుకునేవారికి, గుడిముందు యాచకులకు తేడా లేదని ఘాటుగా మందలించింది. కొందరు రైతుల భూమార్పిడి కేసులో అనుమతుల తిరస్కృతి వ్యవహారంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సాక్షి, బెంగళూరు: ‘ప్రభుత్వం అందించే జీతంతో ఉద్యోగులు అత్యాధునిక కార్లు కాదు కదా... వాటి వైపర్లు (అద్దాలు తుడిచే ఉపకరణం) కూడా కొనలేరు. అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి పిల్లలు వారానికి రెండు మూడుసార్లు బెంజ్, ఆడి వంటి కార్లలో బెంగళూరులో విండ్సర్‌ మ్యానర్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వచ్చి కాఫీ తాగి వెళుతున్నారు. అంతసొమ్ము ఎక్కడ నుంచి వస్తోందో’ అని రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వివరాలు...బెంగళూరు గ్రామీణ ప్రాంతంలోని కొంతమంది రైతులు వారి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగించడానికి వీలుగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖతో పాటు కలెక్టర్‌ కార్యాలయానికి కూడా దరఖాస్తులు పంపించారు. ఇందులో కొంతమందికి అనుమతులు లభించగా మరికొందరికి లభించలేదు.

దీంతో సదరు అనుమతులు లభించని వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ఎస్‌.ఎన్‌ సత్యనారాయణ...‘రెవెన్యూ శాఖ కొంతమంది వల్ల బెగ్గర్స్‌ కాలనీగా మారుతోంది. అందులో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి గుడి ముందు బిక్షమెత్తుకునే వారికి తేడా లేదు. సొమ్ములు ఎక్కువగా ఉన్నవారి భూముల మార్పిడి అనుమతులు ఇచ్చారు, మిగిలినవారికి ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు’ అని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయమై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఎవరికి అనుమతులు లభించాయి. మిగిలిన దరఖాస్తులు ఎన్ని? తదితర వివరాలతో కోర్టుకు హాజరుకావాలంటూ బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్‌ పాలయ్యకు న్యాయమూర్తి నోటీసులు జారీచేశారు.

మరిన్ని వార్తలు