సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతపైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. పబ్లిక్లో దాడి చేసే ధైర్యం లేకనే ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై దాడి చేశారని విమర్శించారు. ఒక ప్రణాళిక ప్రకారమే ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందని అన్నారు. వైఎస్ జగన్పై జరిగిన దాడిని ప్రేరేపించి చేసినటువంటి కుట్రగా ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..‘వైఎస్ జగన్పై జరిగిన దాడిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలి. ఎవరి ప్రేరణతో దాడి జరిగిందో విచారణ జరిపించాలి. టీడీపీ నేతలు మాట్లాడే తీరు.. పూర్తిగా మాఫియా మాట్లాడినట్టుగా ఉంది. ఈ ఘటనపై చంద్రన్న ఇన్వెస్టిగేషన్ కాకుండా.. న్యాయ విచారణ జరిపించాలి. తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు ప్రపంచంలోనే నంబర్ వన్. హింసా రాజకీయాలు ఎవరికీ మంచివి కావ’ని అన్నారు.