‘కిస్‌ ఫెస్టివల్‌ మా ఆచారం’

16 Dec, 2018 11:49 IST|Sakshi

ప్రతి ఏడాది చివరి మాసంలో కిస్‌ ఫెస్టివల్‌

 జార్ఖండ్‌లో గిరిజనుల వింత ఆచారం

ఈ ఏడాది నుంచి నిషేధం : అధికార బీజేపీ

రాంచీ: ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తపరచడం తమ ఆచారమని జార్ఖండ్‌లోని గిరిజనులు అంటున్నారు. ప్రతి ఏడాది చివరి మాసం (డిసెంబర్‌)లో గ్రామస్తులందరూ తమ సహచరులతో కలిసి కిస్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. పాకూర్‌ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్తులు ఎంతో కాలంగా ఈవింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. జార్ఖండ్‌ ముక్తీ మోర్చా (జేఎంఎం)కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.

ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తం పరచడం గిరిజనుల ఆచారమని ఆయన అంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కిస్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు అధికార బీజేపీ అనుమతులను నిరాకరించింది. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం భారతీయ గిరిజన సంస్కృతికి కాదని, అది సమాజానికి చెడు సందేశాన్ని ఇస్తోందని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ ఏడాది కిస్‌ ఫెస్టివల్‌ నిర్వహించేది లేదని స్థానిక జిల్లా ఎస్‌డీఓ జితేంద్ర కుమార్‌ అదేశాలు జారీచేశారు.

గత ఏడాది 18 జంటలు పబ్లిక్‌గా ముద్దుపోటీలో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కిస్‌ ఫెస్టివల్‌పై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముద్దుల పోటీలు గిరిజనుల ఆచారంలో భాగమని, వారు స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమే ఈ పోటీలో పాల్గొంటారని అన్నారు.

మరిన్ని వార్తలు