'నా భర్త రేప్ చేశాడు.. విడాకులు ఇప్పించండి'

7 Dec, 2015 10:07 IST|Sakshi
'నా భర్త రేప్ చేశాడు.. విడాకులు ఇప్పించండి'

అహ్మదాబాద్: 'మా ఆయన అత్యాచారం చేశాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు అత్తంటివారు అమానుషంగా కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేశారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు విడాకులు ఇప్పించి, తగిన భద్రత కల్పించండి' అంటూ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 2002 నరోడా నరమేధం కేసులో దోషీ సురేష్ దేడవాలా అలియాస్ రిచర్డ్స్ భార్య కోర్టును ఆశ్రయించింది.

2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరోడా నరమేధం కేసులో దోషీగా తేలిన దేడవాలాకు మూడేళ్ల క్రితం కోర్టు 31 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్నెల్ల క్రితం పెరోల్పై బయటకు వచ్చినపుడు దేడవాలా తనపై అత్యాచారం చేశాడని, తనకు విడాకులు మంజూరు చేసి, రక్షణ కల్పించాలని అతని భార్య ఈ నెల 1న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దేడవాలాను పెళ్లి చేసుకున్న తర్వాత రెండు దశాబ్దాల పాటు పుట్టింటి వారికి దూరంగా ఉన్న తాను ప్రాణభయంతో మళ్లీ పుట్టింటికి వెళ్లినట్టు అతని భార్య చెప్పింది. ఈ కేసును కోర్టు విచారణకు చేపట్టింది.

మరిన్ని వార్తలు