కరోనా ఎఫెక్ట్‌ : 16 రెట్లు పెంచేశారు..

8 Mar, 2020 16:45 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పలువురు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతో పాటు నిపుణల సూచనల మేరకు హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో మాస్క్‌లతోపాటు హ్యాండ్‌ శానిటైజర్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీని ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో మాస్క్‌ల ధరలను భారీగా పెంచేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌లో హ్యాండ్‌ శానిటైజర్‌ ధరలు భారీగా పెరిగాయి. వాటిని కొనుగోలు చేద్దామని చూసిన వినియోగదారులు ఆ ధరలు చూసి షాకవుతున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 30 ఎమ్‌ఎల్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ బాటిల్‌ ధరను ఏకంగా 16 రెట్లకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌రిటైల్‌ అనే విక్రేత హిమాలయ ప్యూర్‌ హ్యాండ్స్‌ 30 ఎమ్‌ఎల్‌ ధరను రూ. 999 గా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఈ ధరలను చూసిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.

వినియోగదారులు ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్‌ హెల్స్‌ సెంటర్‌ స్పందించింది. అదే వస్తువును ఇతర విక్రేతలు వివిధ రెట్లలో అందిస్తున్నాయని తెలిపింది. దీనిపై హిమాలయ డ్రగ్‌ కంపెనీ స్పందిస్తూ.. తమ సంస్థ హ్యాండ్‌ శానిటైజర్‌ ధరలను పెంచలేదని స్పష్టం చేసింది. ధర్ట్‌ పార్టీ సెల్లర్లు అక్రమంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారు.. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరికొన్ని ఈ కామర్స్‌ సైట్లలో హ్యాండ్‌ శానిటైజర్‌లను ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా సోకినవారి రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకడంతో.. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 39కి చేరింది. (చదవండి : ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా)

>
మరిన్ని వార్తలు