రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

2 Apr, 2020 13:55 IST|Sakshi

ఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ భారీ విరాళం ప్రకటించారు. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ దేశం కోసం మనం ఏం చేశామన్నది అసలు ప్రశ్న. నేను నా రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందిస్తున్నాను. మీరు కూడా తోచినంత సహాయం చేయండి’అంటూ గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేశారు. (రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!) 

కరోనా మహమ్మారీని ఎదుర్కొనేందుకు గౌతమ్‌ గంభీర్‌ చేసిన రెండో సహాయం ఇది. ఇప్పటికే సోమవారం లోక్‌సభలో ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు కావాల్సిన పరికరాల కోసం తన ఎంపీ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ (ఎంపీఎల్‌ఎడీ) నుంచి రూ .50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. (అయ్యో.. వారి పెళ్లి పెటాకులేనా?! )

కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి దాతలు చేయూతనివ్వాలని శనివారం ప్రధాని నరేంద్రమోదీ కోరిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్తగా పీఎం కేర్స్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు దేశంలో 1965 మంది కరోనా బారినా పడగా.. 50 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 151 మంది డిశ్చార్జి అయినట్లు అలాగే బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 437 కేసులు నమోదయినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. (మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. హైకోర్టు స్టే )

మరిన్ని వార్తలు