కరోనా: పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి

30 Jun, 2020 12:00 IST|Sakshi

పట్నా : కోవిడ్‌​-19 నిబంధనలను అతిక్రమించి మరి ఇటీవల ఓ జంట కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతిచెందాడు. దీంతో అసలు విషయమంతా బయటపడింది. పెళ్లికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకెళితే... బిహార్‌ రాష్ట్రంలోని పాలిగంజ్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా జూన్‌ 15న వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక జరిగిన రెండు రోజులకు వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. (కరోనా: భారత్‌లో కొత్తగా 18,522 పాజిటివ్‌ కేసులు)

వరుడు మరణించడంతో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు అతడి దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధులవులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలగా అతిథులందరికీ పరీక్షలు చేశారు. వీరిలో సోమవారం 80 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పెళ్లికి హాజరైన వారిలో 95 మంది కరోనా బారిన పడినట్లు రిపోర్టులు వెలువడగా పెళ్లి కూతురుకి మాత్రం నెగిటివ్‌ వచ్చింది. (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్‌)

ఇక ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మంది మాత్రమే వివాహానికి హాజరవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వివాహ వేడుక జరిగిందన్నారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించకపోవడం వల్లే ఇన్నీ కేసులు వెలుగు చూశాయని అన్నారు. కాగా రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా)

మరిన్ని వార్తలు