పేద కార్మికుల నష్టం 4-6 లక్షల కోట్లు

4 Jun, 2020 17:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌లో ఆహారం కొరత కారణంగా కరువు కాటకాలు ఏర్పడటం లేదు. కార్మికులకు కొనే శక్తి కరువైనప్పుడు కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కరువు కాటకాలను ప్రభుత్వాలు తలచుకుంటే పరిష్కరించవచ్చు’ అని నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్యసేన్‌ చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వారందరి కుటుంబాలకు తిండి పెట్టేంత ఆహార ధాన్యాల నిల్వలు భారత్‌ వద్ద ఉన్నాయి. (వలస కార్మికులు.. వాస్తవాలు)

దేశంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు రెండు నెలల పాటు దినసరి కార్మికులు ఉపాధి కోల్పోవడం వల్ల నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, ఇది భారత జీడీపీలో రెండు నుంచి మూడు శాతమని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీలో ఎకనామిక్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న జయన్‌ జోస్‌ థామస్‌ తెలిపారు. ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ 2018, ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం పురుషుల సగటు వేతన రోజుకు 282 రూపాయలు, మహిళల సగటు వేతనం రోజుకు 179 రూపాయలని ఆయన చెప్పారు. (‘వైరస్‌ కాదు.. ఎకానమీ ధ్వంసం’)

గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనం, మగవారికి నెలకు సరాసరి సగటు 14,024కాగా, మహిళలకు 9,895 రూపాయలని, అదే పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 18,353 రూపాయలుకాగా, మహిళలకు 14,487 రూపాయలని థామస్‌ చెప్పారు. ఈ లెక్కన రెండు నెలల కాలానికి కార్మికులు కనీసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కింద నష్టపోయారని ఆయన అంచనా వేశారు. (ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు