ముంబైకు షాక్‌..‘బెస్ట్‌’ సర్వీసులు బంద్‌

18 May, 2020 13:22 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో దాదాపు మూడో వంతుకు పైగా పాజిటివ్‌ కేసులతో మహారాష్ట్ర అతిపెద్ద కరోనా హాట్‌‌స్పాట్‌గా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లే, ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌) ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో యూనియన్‌ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వైరస్‌తో ఇప్పటికే బెస్ట్‌ ఉద్యోగుల్లో ఎనిమిది మంది మృతి చెందగా 120 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం (మే 18) నుంచి బస్సులు నడపమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ముంబైలో కరోనా విజృంభిస్తున్న సమయంలో బెస్ట్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం నగరానికి మరింత ప్రమదకరంగా మారనుంది. (లాక్‌డౌన్‌ : కేంద్రం కీలక ఆదేశాలు )

ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణాకు సంబంధించి కేవలం బెస్ట్‌ బస్సులు మాత్రమే పనిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా సబర్బన్‌ రైళ్ల సేవలు నిలిపి వేసిన అనంతరం ముంబై అంతటా అత్యవసర సేవల ఉద్యోగుల కోసం బెస్ట్‌ బస్సులు ముఖ్యపాత్ర పోషించాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో తమ సిబ్బందికి తగిన భద్రతా చర్యలు అందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచిన్నట్లు యూనియన్‌ అధినేత శశాంక్‌ రావు తెలిపారు. కార్మికులకు ప్రత్యేక క్వారంటైన్‌, ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కింద కోటి రూపాయలతోపాటు కుంటుంటంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. (లాక్‌డౌన్‌ 4.0: కొత్త నిబంధనలు ఇవే! )

కాగా ముంబైలో  బెస్ట్ బస్సుల స్థానంలో కనీసం 1,200 మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 96,169కు చేరాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కరోనా‌ కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. (ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు )

మరిన్ని వార్తలు