కరోనా పోరు: మాస్కులు కుట్టిన రాష్ట్రపతి సతీమణి

23 Apr, 2020 08:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందించారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న కృషికి ఆమె బాసటగా నిలిచారు. నిరాశ్రయుల కోసం బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని శక్తి హాత్‌ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్‌ మాస్క్‌లు కుట్టారు. వీటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందజేయనున్నారు. సవితా స్వయంగా మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై వ్యతిరేక పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే మాస్కులు కుడుతున్న సమయంలోనూ ఆమె ముఖానికి మాస్కు ధరించడం విశేషం. ( ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ)

ఇక దేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 130 కోట్ల మందికి పైగా ఉన్న దేశంలో కరోనాను కట్టడి చేయడం కత్తి మీద సాములాగా తయారయింది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు తెలియజేస్తూనే ఉన్నారు. కాగా భారత్‌లో కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 20, 471 నమోదవ్వగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. 3960 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అ‍య్యారు. (‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’ )

మరిన్ని వార్తలు