భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 239

11 Apr, 2020 16:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ లేకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. భారత్‌లో మొత్తం 7,447 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనాతో కోలుకుని ఇప్పటివరకూ 642మంది డిశ్చార్జ్‌ అయినట్లు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 586 కరోనా ఆస్పత్రులు, లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌తో పాటు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మహారాష్ట్రలో కరోనా బారిన పడి అత్యధికంగా 110మంది మృతి చెందారు. (ప్రధానితో కాన్ఫరెన్స్: అందరి నోట అదే మాట!

మరోవైపు ముఖ్యమంత్రులుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధానిని కోరాయి. దీంతో రాష్ట్రాల విజ్ఞాపనలతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. కాగా ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగియనుంది. రాష్ట్రాల అభ్యర్థలతో ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పంజాబ్‌, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకూ పొడిగించింది. (కరోనా మృతదేహాలు: మహారాష్ట్ర కీలక నిర్ణయం!)

మరిన్ని వార్తలు