కరోనా నిర్థారణ పరీక్షకు రూ.5 వేలు

20 Mar, 2020 11:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకిందా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే ఒక్కో పరీక్షకు 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దేశవ్యాప్తంగా డయోగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోన్న ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు  దీని గురించి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్‌ ల్యాబ్‌లు జర్మనీ, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని, దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే 500 రూపాయల చొప్పున పరీక్షలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. (కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ)

భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకారం కరోనా వైరస్‌ ప్రాథమిక పరీక్షకు 1500 రూపాయలు, అనంతరం నిర్వహించే నిర్ధారణ పరీక్షకు 3000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ ల్యాబ్‌లే నిర్వహించగా, ఇక ముందు నుంచి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉచితంగా నిర్వహించాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి బుధవారం పిలుపునిచ్చింది. అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. (ఇది చైనా పాపమే : ట్రంప్)

కాసులకు కక్కుర్తిపడే ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా ఈ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయా? అప్పుడు వాటి పరీక్షల్లో ప్రామాణికత ఉంటుందా? అన్నది ప్రజల సందేహం?  ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రస్తుతం అనుమానితులందరికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించకుండా, కరోనా విస్తరించిన దేశాల నుంచి వచ్చిన వారికి, వైరస్‌ నిర్ధారిత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం థర్మల్‌ గన్‌తో పరీక్షిస్తూన్నది జ్వరం ద్వారా అనుమానితులను గుర్తించేందుకు మాత్రమే! (టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్..

దేశంలో వందలోపు వ్రైవేటు ల్యాబ్‌లకే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని జీఎస్‌కే వేలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు వేలాది మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే కష్టమే!

మరిన్ని వార్తలు