24 గంటల్లో ఒక్క కేసు నమోదు కాలేదు : సీఎం

24 Mar, 2020 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొద్దిగా ఉపశమనం కలిగించే వార్తను వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. 

‘కరోనా సోకినవారిలో 5 గురు వ్యక్తులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  అయితే మేము దీన్ని చూసి సంతోషంగా లేము. పరిస్థితి చేయి దాటి పోకుండా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో 30 మందికి కరోనా పాజటివ్‌గా తేలింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా 492 మందికి కరోనా సోకినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందులో 41 మంది విదేశీయులు ఉన్నారు.

చదవండి :  ఈశాన్య భారతానికి పాకిన కరోనా

తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు 

మరిన్ని వార్తలు