ఏషియన్‌ గేమ్స్ స్వర్ణ పతక విజేతకు కరోనా

31 May, 2020 19:33 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ (41)కు కరోనా వైరస్‌ సోకింది. 1998 ఆసియా క్రీడల్లో ఆయన‌ స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం డింకో సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రేడియేషన్‌ థెరపీకి దూరమైన డింకోను ఈనెల 25న ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీకి తీసుకొచ్చారు. చికిత్స కోసం డింకో కొంతకాల అక్కడే గడిపారు. అయితే, రేడియేషన్‌ థెరపీ అనంతరం ఆయన 2400 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి మణిపూర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు.

ఆయనకు వైరస్‌ లక్షణాలు బయటపడటంతో మణిపూర్‌లో కరోనా పరీక్ష నిర్వహించారు. ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో ఉన్న క్రమంలోనే ఆయన కరోనా బారినట్టు తెలుస్తోంది. బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబర్చిన డింకోను భారత ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. ఇక డింకో సింగ్‌కు మెరుగైన వైద్య సహాయం అందించాలని క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజు మణిపూర్‌ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, భారత్‌లో కోవిడ్‌ బారినపడ్డ ప్రముఖ ఆటగాళ్లలో మొదటివాడిగా డింకో నిలిచారు.
(చదవండి: కొంపముంచిన లాక్‌డౌన్‌ 4.0..!)

మరిన్ని వార్తలు