కరోనా: కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

9 Jun, 2020 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 

ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దని, ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలని తెలిపింది. మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలని, మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం చెప్పింది.
(చదవండి: 24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు)

>
మరిన్ని వార్తలు