దేశంలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 7964 కేసులు

30 May, 2020 09:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,422 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్) 

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 3,66,891 మంది మరణించారు. తాజాగా ఒక్క అమెరికాలోనే 1,225 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1,04,542కు చేరింది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 17,45,606 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు గణనీయంగానే పెరుగుతున్నాయి. శుక్రవారం 2429 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాక్‌లో కరోనా కేసుల సంఖ్య 66,457కు చేరింది. చైనాలో శుక్రవారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. (జాగ్రత్తలతో జయిద్దాం)

>
మరిన్ని వార్తలు