కరోనా: మీద పడి రిజిస్టర్‌ చించేశారు!

29 Apr, 2020 14:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హరిద్వార్‌: కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా వివరాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందిపై గ్రామస్తులు దాడిచేసిన ఘటన ఉత్త‌రాఖండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. హరిద్వార జిల్లాలోని మఖాన్‌పూర్‌ గ్రామంలో ఆశా కార్యకర్తలు కొవిడ్‌-19 స‌ర్వే కోసం వెళ్లగా స్థానికులు దాడికి దిగారు. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా వారిప‌ట్ల‌ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. తమ పేర్లను ఎందుకు నమోదు చేశారని బూతులు తిడుతూ.. వారి చేతుల్లోని రిజిస్ట‌ర్ల‌ను లాక్కుని పేజీల‌ను చించేశారు. 
(చదవండి: అలా అయితే ఆఫీస్‌కు రావద్దు : కేంద్రం)

తాము ఇంటింటి స‌ర్వే చేస్తుండ‌గా కొంద‌రు దాడికి పాల్ప‌డ్డార‌ని, ఒక మ‌హిళ త‌మ చేతిలోని రిజ‌ష్ట‌ర్లు లాక్కుని చించేసిందని ఆశా వర్కర్లు తెలిపారు. ఘ‌ట‌న‌లో త‌మ‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయ‌ని అనిత అనే ఆశా వ‌ర్క‌ర్ వెల్లడించారు. ఈ ఘటనపై ఆశా వర్కర్ల ఫిర్యాదు అందింద‌ని హరిద్వార్‌ ఎస్పీ సెంథిల్‌ అబుదై కృష్ణరాజ్‌ తెలిపారు. మహిళా ఆరోగ్య సిబ్బంది పట్ల అస‌భ్యంగా ప్రవర్తించి, భౌతిక దాడికి పాల్ప‌డిన‌వారిపై ఎపిడెమిక్‌ డీసీజెస్‌ యాక్ట్‌ (2020-ఆర్డినెన్స్‌) ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు న‌మోదు చేసి నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని, మిగతావారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
(చదవండి: ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం)

మరిన్ని వార్తలు