నో లిక్కర్‌.. రోజుకు ఎంత నష్టమో తెలుసా?

17 Apr, 2020 09:18 IST|Sakshi

రోజుకు రూ.700 కోట్లు

దేశంలో మద్యం అమ్మకాల నిషేధంతో భారీగా నష్టం..

గత నెల 22 నుంచి రూ.17,500 కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రాలు

తెలంగాణలోనే రూ.2 వేల కోట్లు.. మహారాష్ట్రలోనూ అదేస్థాయిలో..

లాక్‌డౌన్‌ ఉన్నా లిక్కర్‌ విక్రయాలకు పలు రాష్ట్రాల ప్రయత్నాలు

అనుమతించబోమని తేల్చిచెప్పిన కేంద్రం.. తలొగ్గక తప్పని పరిస్థితి 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగితే ఎంత కిక్కు వస్తుందో తాగేవారికే తెలుస్తుంది కానీ.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు మాత్రం కిక్కే కిక్కు..! ఎంత కిక్కంటే.. కొన్ని సార్లు ప్రభుత్వాలు తక్షణావసరాల కోసం ఈ కిక్కు ద్వారా వచ్చే నిధులపైనే ఆధారపడతాయంటే అతిశయోక్తి కాదు. అలాంటిది దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా గత 25 రోజులుగా అమలవుతోన్న మద్య నిషేధం కారణంగా ఎంత నష్టం జరుగుతుందో తెలిస్తే అవాక్కు కాక తప్పదు.. రోజుకు అక్షరాలా రూ.700 కోట్లు. ఈ మొత్తం ఆయా ప్రభుత్వాల ఖజానాలకు చేరాల్సింది మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే మద్యం అమ్మకాల నిషేధం కారణంగా గత 25 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు నష్టపోయాయన్నమాట.  

రూ.20 వేల కోట్ల పైమాటే! 
దేశంలోని చాలా రాష్ట్రాలు మద్యాన్ని ఆదాయార్జన వనరుగానే పరిగణించాల్సి వస్తోంది. తెలంగాణతో సహా అనేక పెద్ద రాష్ట్రాలు ప్రతియేటా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని మద్యం ద్వారా గడిస్తున్నాయి. గతేడాది లెక్కల ప్రకారం మహారాష్ట్ర రూ.24 వేల కోట్లు, యూపీ రూ.26 వేల కోట్లు, తెలంగాణ రూ.21,500 కోట్లు, కర్ణాటక రూ.20 వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం పొందాయి. అంటే గత 25 రోజుల లెక్క చూస్తే (పెరిగిన ధరల ప్రకారం) తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్‌ కారణంగా మద్యం అమ్మకాల ద్వారా రావాల్సిన రూ.2 వేల కోట్ల మేర నష్టపోయింది. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక కూడా ఆమేర నష్టపోయాయి. కానీ, కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే ఆర్థికం ప్రధానాంశం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలను అనుమతించేదే లేదని కేంద్రం భీష్మించుకుంది.  

నో చాన్స్‌..: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు లిక్కర్‌ అమ్మకాలు జరిపేందుకు ప్రయతి్నంచాయి. ముందుగా కేరళ ఆ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ల సలహా మేరకు లిక్కర్‌ అమ్మే ప్రయత్నం చేయగా ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. ఆ తర్వాత పశి్చమబెంగాల్, కర్ణాటక, అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా కొంత ప్రయత్నం చేసినా తాజాగా కేంద్రం జారీ చేసిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలతో గతంలో ఇచి్చన ఉత్తర్వులన్నింటినీ వెనక్కు తీసేసుకున్నాయి. బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను అనుమతించొద్దని, ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమే అయినా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఎంత నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు.. మానసికంగా ఎంత ఒత్తిడి ఉన్నా మద్యం ప్రియులు.. లాక్‌డౌన్‌ ఎత్తేసేవరకు ఆ దిశలో ఆలోచించాల్సిన పనిలేదన్నమాట.  

చదవండి:
లాక్‌డౌన్‌: ఏకబిగిన 70 కి.మీ. నడక
ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా?
కేసీఆర్‌ తాత నిన్ను పాస్‌ చేసిండుపో.. 

మరిన్ని వార్తలు