వైద్యుడికి క‌రోనాతో మేఘాల‌య‌లో తొలి కేసు

14 Apr, 2020 09:01 IST|Sakshi

షిల్లాంగ్‌: త‌మ రాష్ట్రంలో ఒక్క క‌రోనా కేసు లేనందున‌, లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించుకున్న మేఘాల‌య‌లో తొలి కేసు న‌మోదైంది. దీంతో అక్క‌డి స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. షిల్లాంగ్‌లోని బెథ‌నీ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న వైద్యుడికి క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించ‌‌గా సోమ‌వారం పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మార్చి 22 నుంచి స‌ద‌రు ఆసుప‌త్రికి వెళ్లినవారు వెంట‌నే 108ను సంప్ర‌దించాల‌ని, లేదా http://meghalayaonline.gov.in/covid/login.htm లో త‌మ పేరు ‌న‌మోదు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఆ ఆసుప‌త్రి నుంచి రోగులు, డాక్ట‌ర్లు, న‌ర్సు, ఇత‌ర సిబ్బంది ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. (పర్యాటకులకు అత్యవసర సమాచారం)

మ‌రోవైపు అధికారులు అత‌నితో స‌న్నిహితంగా మెలిగిన వారి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో నేటి నుంచి 48 గంట‌ల‌పాటు క‌ర్ఫ్యూ విధించారు. ఈ కొత్త కేసుతో ఈశాన్య రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య 38కి చేరింది. ఇందులో అస్సాం 30, మ‌ణిపూర్‌, త్రిపుర 2, మిజోరాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, నాగాలాండ్, మేఘాల‌య 1 కేసు న‌మోద‌య్యాయి. కాగా దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప‌దివేలు దాట‌గా 358 మంది మృతి చెందారు. 1,193 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. (ఏప్రిల్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ పాక్షిక ఎత్తివేత!)

మరిన్ని వార్తలు