కరోనాపై అంతుచిక్కని అంశాలు

21 Apr, 2020 15:26 IST|Sakshi

సాక్షి, ముంబై : ఏప్రిల్‌ ఏడవ తేదీనా ముంబై నగరంలోని రాజావాడి ఆస్పత్రికి 25 ఏళ్ల యువకుడు కరోనా వైరస్‌ బాధితుడిగా వచ్చి చేరారు. ఆ యువకుడికి ఊపిరితిత్తుల సమస్యగానీ, తీవ్రమైన కిడ్నీల సమస్యగానీ, మధుమేహంగానీ, ఆఖరికి రక్తపోటుగానీ లేవు. అయినప్పటికీ ఆయన కరోనా వైరస్‌ మృతుల్లో చేరిపోయారు.

అదే రోజు లోకమాన్య తిలక్‌ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ ఆస్పత్రిలో 45 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో చేరారు. ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆయనకు కూడా ప్రమాదకరమైన ఇతర జబ్బులేమీ లేవు. అయినప్పటికీ ఆయన కోలుకోలేక పోయారు. చైనాతోపాటు పలు దేశాల నుంచి వచ్చిన వార్తల ప్రకారం కరోనా వైరస్‌ పదేళ్లలోపు పిల్లలకు సోకదని, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయ జబ్బులతో బాధ పడుతున్న వారికే ప్రాణాంతకమని వింటూ వచ్చాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరగుతుండడం అంతుచిక్కడం లేదని ముంబైకి చెందిన అంటు రోగాల నిపుణుడు, కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టాస్క్‌ఫోర్స్‌’ సభ్యుడు ఓం శ్రీవాత్సవ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ముంబై వైద్యాధికారులు విడుదల చేసిన డేటా ప్రకారం కరోనా బాధిత మృతుల్లో 87 శాతం మంది ఇతర రోగాలతో బాధ పడుతున్నవారు ఉండగా, ఏడెనిమిది శాతం మంది వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. మిగతావారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువత కావడమే అంతుచిక్కకుండా ఉందని శ్రీవాత్సవ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో మృతుల సంఖ్య 3.3 శాతం ఉండగా, ముంబైలో మృతుల సంఖ్య ఆరు శాతం ఉండడం కూడా వైద్యులకు అంతుచిక్కని విషయంగా మారింది.

చదవండి: వారి పరిస్థితి మరీ దుర్భరం

>
మరిన్ని వార్తలు