కరోనా కిట్ల కాంట్రాక్ట్‌లో మతలబు ఏమిటీ?

13 May, 2020 18:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో యాంటీ బాడీస్‌ను గుర్తించేందుకు ‘ఎలిసా కిట్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో పుణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీ’ ప్రభుత్వ లాబరేటరీ అభివద్ధి చేసింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఐసీఎంఆర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించింది. కమర్షియల్‌గా భారీ ఎత్తున ఎలిసా కిట్ల ఉత్పత్తిని అహ్మదాబాద్‌లోని ‘జైడస్‌ కడీలా’ అనే ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి అప్పగించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దీనికి భారత్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ లైసెన్స్‌ మంజూరు చేసినట్లు పేర్కొంది. (విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా..)

ఎలిసా కిట్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి పత్రికా ప్రకటనలు చేయకుండా, కనీసం బిడ్డింగ్‌లను కూడా పిలువకుండా ఏకపక్షంగా ఉత్పత్తి ఉత్తర్వులు ఏమిటని దేశంలోని ఇతర ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు చైనా నుంచి కనీసం దిగుమతి లైసెన్స్‌ కూడా లేకండా కరోనా కిట్ల సరఫరాకు 30 కోట్ల కాంట్రాక్ట్‌ను ఢిల్లీకి చెందిన ఓ చిన్న ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి బిడ్డింగ్‌ లేకుండా ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిన విషయాన్ని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. నాడు ‘ఆర్క్‌ ఫార్మాస్యూటికల్స్‌’ కంపెనీకి ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండా ఆర్డర్‌ ఇవ్వడం వల్ల, ఆ కంపెనీకి  విదేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే లైసెన్స్‌ లేక పోవడం వల్ల మరో రెండు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. (ఒక్కరోజులో 3,525 కేసులు)

ఫలితంగా 245 రూపాయలకు రావాల్సిన కరోనా పరీక్షల కిట్‌ ప్రభుత్వానికి 600 రూపాయలకు పడింది. ఎలిసా కిట్ల తయారీని కాంట్రాక్ట్‌ను  ఏ ప్రాతిపదికన ‘జైడస్‌ కడిలా’ కంపెనీకి ఇచ్చారని సోమవారం విలేకరులు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ను ప్రశ్నించగా, రెండు ప్రాతిపదికలపై ఇచ్చినట్లు చెప్పారు. ‘ప్రథమ ప్రాధాన్యత, త్వరతగతి ఉత్పత్తి’ అంశాల ప్రాతిపదికన అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రాతిపదికలు మిగతా కంపెనీలకు ఉండవని ప్రభుత్వాధికారులు ఓ అభిప్రాయానికి ఎలా వచ్చారన్నది శేష ప్రశ్న. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!)

మరిన్ని వార్తలు