కరోనా భయంతో ఆస్పత్రిపై నుంచి దూకాడు..

5 Apr, 2020 15:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్‌ జై ప్రకాశ్‌నారాయణ్‌ అపెక్స్‌ ట్రామా సెంటర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్‌ ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి అతడు ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. 

అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. ఎత్తు నుంచి పడటం వల్ల అతని కాలు ఫ్రాక్చర్‌ అయిందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు దేశంలో రోజరోజుకు కరోనా వైరస్‌ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 3374 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 77 మంది మృతిచెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు