జీఎస్ఎల్వీ మార్క్-3కి కౌంట్డౌన్ ప్రారంభం

17 Dec, 2014 12:26 IST|Sakshi

నెల్లూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ రాకెట్ కోసం బుధవారం ఉదయం 8 గంటల 30 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 9 గంటలకు ఈ రాకెట్‌ నింగలోకి దూసుకెళ్లనుంది. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమి నుంచి 136 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే .. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతో పాటు మానవ సహిత ప్రయోగాలకు కూడా సిద్ధమయ్యేందుకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు