తిరువనంతపురం: వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్న జంట మధ్య ప్రేమ, ప్రణయాలను చాటుతూ.. చిత్రీకరిస్తున్న ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. చాలామంది జంటలు పెళ్లికి ముందే తమ మధ్య మధురానుభూతులను ఇలా ఫొటోల్లో బంధిస్తున్నారు. అయితే, ఇటీవల కేరళలోని ఓ జంటపై చిత్రీకరించిన ప్రీవెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందుకు కారణం షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక చిన్న అపశ్రుతి..
ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా ఓ నదిలో పడవలో కూర్చుని జంట ముద్దుపెట్టుకోబోతుండగా.. పడవ బ్యాలెన్స్ తప్పి.. ఇద్దరు అమాంతంలో నీళ్లలో పడిపోయారు. అదృష్టం బావుండి పెద్దగా లోతు లేకపోవడంతో జంటకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ వారు అమాంతం నీటిలో పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
థిరువల్లకు చెందిన తిజిన్ థాంకచెన్, చంగనచెర్రీకి చెందిన శిల్ప వచ్చేనెల ఆరో తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారు పథనంతిట్టు జిల్లాలోని పంబా నది ఒడ్డును ప్రీవెడ్డింగ్ షూట్లో పాల్గొన్నారు. షూట్లో భాగంగా ఫొటోగ్రాఫర్ సూచనల మేరకు పడవలో కూర్చున్న వారు ముద్దుపెట్టుకునేందుకు సమీపిస్తుండగానే.. అమాంతం పడవ అదుపుతప్పి.. నీళ్లలో పడిపోయారు. అయితే ఇలా నీళ్లలోకి పడిపోవడం అనేది తమ ‘ప్లానింగ్’లో భాగమేనని, ఆ విషయం ముందుగానే జంటకు తెలియకుండా ట్విస్టు ఇచ్చామని.. ఈ ప్రీవెడ్డింగ్ షూట్ బాగా వచ్చిందని షూట్ ఆర్గనైజర్ ఓ మీడియా చానెల్కు తెలుపడం కొసమెరుపు.