మేజర్‌ గొగోయ్‌పై ముగిసిన కోర్ట్‌ మార్షల్‌ 

1 Apr, 2019 02:56 IST|Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌:  ఓ యువతితో సన్నిహితంగా ఉంటూ పట్టుబడిన ఆర్మీ మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌పై సైనిక కోర్టులో విచారణ పూర్తయింది.  మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ 2018 మేలో స్థానిక యువతి(18)తో కలిసి శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు. అక్కడ పోలీసులతో గొడవకు దిగడంతో వారు  ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌..కోర్టు మార్షల్‌కు ఆదేశించారు.  మేజర్‌ గొగోయ్‌ మారు పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లు శ్రీనగర్‌ యువతి వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు సైనిక న్యాయస్థానం..ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన మేజర్‌ గొగోయ్‌ సీనియారిటీని తగ్గించే అవకాశమున్నట్లు సమాచారం.  2017లో కశ్మీర్‌లో పెట్రోలింగ్‌ సందర్భంగా రాళ్లు రువ్వుతున్న మూకల నుంచి రక్షణ పొందేందుకు మేజర్‌ గొగోయ్‌ తన జీప్‌ బోయ్‌నెట్‌పై ఓ సాధారణ పౌరుడిని కట్టేసిన ఘటనపై తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు