న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హై కోర్టు మండిపడింది. ఆమెకు జారీ చేసిన ‘లుకౌట్ నోటీసు’ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతు నొక్కలేరని....అభివృద్ధి విధానాలపై భిన్నాభిప్రాయాలువ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
మధ్యప్రదేశ్లోని మహాన్లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళ్లై లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. గత జనవరి 1l న లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళ్లైను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.