భార్యతో ఉండాలని కోర్టులు ఒత్తిడి చేయలేవు

27 Nov, 2017 02:37 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్యను తనవద్దే ఉంచుకోవాల్సిందిగా భర్తను న్యాయస్థానాలు ఒత్తిడి చేయజాలవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది మానవ అనుబంధాలకు సంబంధించిన విషయమని వెల్లడించింది. భార్యా పిల్లల పోషణ నిమిత్తం నాలుగు వారాల్లోగా రూ.10లక్షలు చెల్లించాలని జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్, జస్టిస్‌ యుయు లలిత్‌ల ధర్మాసనం ఓ పైలెట్‌ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఆమె ఎలాంటి షరతులు లేకుండా తీసుకునేలా చూడాలంది. అంతేకాకుండా మద్రాస్‌ హైకోర్టు సదరు వ్యక్తికి రద్దు చేసిన ముందస్తు బెయిల్‌ను పునరుద్ధరించింది.

తమిళనాడుకు చెందిన ఓ పైలెట్‌పై దాఖలైన గృహ హింస కేసులో సుప్రీం ఈ మేరకు స్పందించింది. నిందితుడు శాఖాపరమైన చర్యల్ని తప్పించుకునేందుకు భార్యా పిల్లలతో కలిసి ఉంటానని హామీ ఇచ్చాడనీ, అనంతరం దాన్ని నెరవేర్చలేదని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. దీంతో అతని ముందస్తు బెయిల్‌ను మదురై బెంచ్‌ తిరస్కరించిందన్నారు. వాదనలు విన్న సుప్రీం.. ఈ కేసు విచారణ నివేదికను ట్రయల్‌ కోర్టుకు అందజేయాలని పోలీసుల్ని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు