విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇప్పటికే ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సమాజంలోని సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటాడు. తాజాగా కరోనా వ్యాప్తి నివారణ కోసం జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ‘జనతా కర్ఫ్యూతో.. నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ, నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను.
నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి కూడా ఆలోచించాను. కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు. నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’అంటూ ప్రకాశ్ రాజ్ ట్విటర్లో పేర్కొన్నారు.
#JanathaCurfew .. what I did today .. let’s give back to life .. let’s stand together.🙏🙏 #justasking pic.twitter.com/iBVW2KBSfp
— Prakash Raj (@prakashraaj) March 22, 2020