ఆరోగ్య సేతు అడ్డుపెట్టి కరోనా ఆపగలమా?

28 Apr, 2020 05:25 IST|Sakshi

కోవిడ్‌ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరగా వెళితే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది

మీరు తిరిగే ప్రదేశాలను ట్రాక్‌ చేస్తూ సేఫ్‌ జోన్‌ అవునో కాదో చెప్పేస్తుంది

మీకున్న లక్షణాలు చెబితే కరోనా వైరస్‌ ముప్పు ఎంతో హెచ్చరిస్తుంది

అన్నీ చేస్తుంది సరే.. దీంతో కలిగే ప్రయోజనం ఎంత ?

ఆరోగ్య సేతుతో కరోనాని నియంత్రించగలమా ?  

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సప్తసూత్రాల్లో ఆరోగ్య యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవడం కూడా ఒకటి. మొత్తం 11 భాషల్లో ఇంగ్లీష్, ఇతర 10 భారతీయ భాషలు ఆరోగ్యసేతు అందుబాటులో ఉంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, కరోనా కేసుల్ని నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. . అందుకే పదే పదే టెలికం సంస్థల నుంచి ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని మెసేజ్‌లు వస్తుంటాయి.

ప్రధాని పిలుపునిచ్చిన తర్వాత ప్రజలు ఈ యాప్‌ని రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు కానీ దీని వల్ల కలిగే ప్రయోజనం ఎంత అన్న చర్చ మొదలైంది. ఆరోగ్య సేతుని డౌన్‌లోడ్‌ చేసుకున్నాక వారి ఫోన్‌నెంబర్‌ రిజిస్టర్‌ అవుతుంది. బ్లూటూత్, లొకేషన్‌ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. ఆ వ్యక్తి కోవిడ్‌ వ్యాధిగ్రస్తుల వద్దకి కానీ, క్వారంటైన్‌లో ఉన్న వారి దగ్గరగా వెళ్లి ఒక రెండు నిమిషాల గడిపితే వెంటనే యాప్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నామని అప్రమత్తం చేస్తుంది.

ఆ తర్వాత ఎవరికైనా వైరస్‌ సోకినా అంతకు ముందు వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారు ? ఎవరెవరిని (అప్పటికే అవతల వ్యక్తులు కూడా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఉండాలి) కలుసుకున్నారు వంటివి ట్రాక్‌ చేయడం సులభం అవుతుంది. చైనా, దక్షిణ కొరియా మినహా ఈ తరహా యాప్‌ వాడుతున్న భారత్‌ సహా మిగిలిన దేశాల్లో కేవలం ట్రాకర్‌గానే ఉపయోగపడుతుంది తప్ప, మరే విధంగానూ వైరస్‌ని నియంత్రించలేదని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది.  

సగం జనాభా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
ఆరోగ్య సేతు యాప్‌ని 50 నుంచి 60శాతం మంది వినియోగిస్తేనే ఫలితం ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనకారులు చెబుతున్నారు. మన దేశ జనాభాలో యాప్‌ని 5 శాతం మంది కంటే తక్కువే డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల సరైన ఫలితాలు వెలువడే అవకాశం లేదు

విసురుతున్న సవాళ్లు  
► చాలా తక్కువగా జరుగుతున్న కరోనా పరీక్షలు  
► స్మార్ట్‌ వినియోగదారుల సంఖ్య అతిస్వల్పం
► బ్లూటూత్, లొకేషన్‌కి పర్మిషన్‌ లేకుండా ట్రాకింగ్‌ కుదిరే పనికాదు  
► ప్రజలు తమ లక్షణాలపై తప్పుడు సమాచారం ఇచ్చినా రిస్క్‌ జోన్‌లోకి వెళతారు.

యాప్‌తో కరోనాను నియంత్రిస్తున్న దేశాలు  
సింగపూర్, దక్షిణ కొరియా, చైనా , ఇరాన్, ఇజ్రాయెల్, తైవాన్, ఆస్ట్రియా, బెల్జియం, జర్మనీ, ఇటలీ.

పరీక్షలే పరిష్కారం
ఆరోగ్య సేతు వంటి యాప్‌ల ద్వారా ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచడం, ట్రాకింగ్‌ వంటివే సాధ్యం. కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఎంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే కరోనా ముప్పు నుంచి అంత త్వరగా బయటపడవచ్చునని వారు చెబుతున్నారు.

దేశ జనాభా: 130 కోట్లు
స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు: 40 కోట్లు (28%)
17 రోజుల్లో యాప్‌ డౌన్‌లోడ్లు: 6 కోట్లు
(దేశ జనాభాలో 5% కంటే తక్కువ)

మరిన్ని వార్తలు