కరోనా తొలి మరణం: కర్ణాటక యాక్షన్‌ ప్లాన్‌!

13 Mar, 2020 17:14 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పూనుకున్నాయి. కోవిడ్‌ తొలి మరణం సంభంవించిన కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం వారం రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను ప్రకటించించారు.
(చదవండి: భారత్‌లో తొలి మరణం)

రేపటి నుంచి వారం రోజులపాటు మాల్స్‌, థియేటర్లు, పాఠశాలలు‌, కాలేజీలు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని యడియూరప్ప స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు ఐదు నమోదయ్యాయి. వీరిలో  గూగుల్‌ ఉద్యోగి కూడా ఉన్నాడు. 

అంతటా బంద్‌లు..!
కరోనా కట్టడిడికి బిహార్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. యూపీలో మార్చి 22 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌ చేయగా.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసేయాలని హర్యానా సర్కార్‌ ఆదేశాలిచ్చింది. ఇక మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసేయాలని కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే.
(చదవండి: కరోనా ఎఫెక్ట్‌ : ఇంగ్లండ్‌ ఆటగాళ్ల తిరుగుముఖం)

మరిన్ని వార్తలు