విదేశీ విద్య కలలు కల్లలేనా?

14 May, 2020 05:18 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుకోవాలనుకొం టోన్న 48 శాతం మంది భారతీయ విద్యార్థులపై కోవిడ్‌ ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ విద్యాసంస్థలకు గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఇచ్చే క్వాక్వారెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఖరీదైన విదేశీ విద్య, కోవిడ్‌ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లడంతో విద్యార్థులు ఇతర అవకాశాలవైపు చూడాల్సి వస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇండియన్‌ స్టూడెంట్స్‌ మొబిలిటీ రిపోర్ట్‌ 2020, ఇంపాక్ట్‌ ఆఫ్‌ కోవిడ్‌ ఆన్‌ హయ్యర్‌ ఎడ్యురేషన్‌ ఛాయిసెస్‌’’అన్న పేరుతో భారత దేశంలోని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలకు రేటింగ్‌ ఇచ్చే లండన్‌కి చెందిన క్యూఎస్‌ సంస్థ అధ్యయనం చేసింది.

ఇటీవలికాలంలో విదేశీ విద్యనభ్యసించేందుకు సంసిద్ధమౌతోన్న 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కోవిడ్‌ ప్రభావం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఇందులోని చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ యేతర విద్యార్థులు విదేశాల్లో చదువుకోవా లన్న తమ అభిప్రాయాన్ని పునఃపరిశీలించుకుంటున్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (స్టెమ్‌) విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలకు డిమాండ్‌ ఉండవచ్చుననీ, నాన్‌స్టెమ్‌ విద్యార్థులకు అవకాశాలు తగ్గొచ్చని రిపోర్టు తెలిపింది. విదేశీ విద్యకోసం వెళ్ళే విద్యార్థులపై ప్రభావంతో పాటు, దేశంలో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విద్యార్థులపై సైతం కోవిడ్‌ ప్రభావం ఉండవచ్చునని రిపోర్టు వెల్లడించింది.

మరిన్ని వార్తలు