కరోనా: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.50! 

17 Mar, 2020 17:34 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్‌ మాల్స్‌, పబ్లిక్‌ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి. అదే విధంగా వివాహ వేడుకలను కూడా వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టు ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచినట్లు పేర్కొంది.(చదవండి: ‘గ్రాండ్‌ ప్రిన్సెస్‌’లో చిక్కుకున్న భారతీయులు!)

ఈ మేరకు రైల్వే శాఖ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచనున్నాం. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్‌, రట్లాం, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.50కి పెంచింది’’ అని పేర్కొన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం ధరను పెంచేందుకు 2015 మార్చిలో డివిజన్‌ రైల్వే మేనేజర్లకు అధికారం ఇస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం భారత్‌లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది. ఇక ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా దేశంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.(‘కరోనా’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం!)

చదవండి: ‘కరోనా’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం!

వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా?

కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు

మరిన్ని వార్తలు