ప్రచారంలో సెల్ఫీల ఆరాటం..కూలిన స్టేజీ

8 May, 2019 17:19 IST|Sakshi

కోల్‌కతా : తమ అభిమాన నటితో సెల్ఫీలు దిగాలని ఆశపడిన బెంగాల్‌ వాసులకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ప్రముఖ బెంగాళీ నటి నుస్రత్‌ జహాన్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ నుంచి ఎన్నికల బరిలో ఉన్న నుస్రత్‌ క్రేజ్‌ దృష్ట్యా.. ఇతర అభ్యర్థులకు కూడా ప్రచారం నిర్వహించేలా పార్టీ షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇందులో భాగంగా టీఎంసీ తరఫున జార్‌గ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న బీర్బాహ సోరెన్‌కు మద్దతుగా నుస్రత్‌ బుధవారం ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో జర్‌గ్రామ్‌ నియోజకవర్గంలోని గోపిబల్లాపూర్‌లో స్టేజీ ఎక్కి ప్రసంగిస్తుండగా ఆమెను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఆమె చుట్టూ చేరడంతో స్టేజీ కూలిపోయింది. అయితే స్టేజీ ఎత్తు తక్కువగా ఉండటడంతో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కానీ ఈ ఘటనతో కొంతసేపు షాక్‌కు గురైన నుస్రత్‌ వెంటనే తేరుకుని.. తనకేం కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని.. భయపడవద్దని చెప్పారు.  కాగా తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నుస్రత్‌ ప్రచార కార్యక్రమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాటలు పాడుతూ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఆమె నియోజకవర్గం బసిర్‌హట్‌లో మే 19న పోలింగ్‌ జరుగునుంది.

మరిన్ని వార్తలు