సీఆర్పీఎఫ్‌లో అందరూ భారతీయులే 

23 Feb, 2019 02:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు పోలీస్‌ దళం(సీఆర్పీఎఫ్‌)లో అందరినీ భారతీయులుగానే గుర్తిస్తామనీ, ఇక్కడ కులం, మతం వంటి విభజనలు ఉండవని సీఆర్పీఎఫ్‌ డీఐజీ ఎం.దినకరణ్‌ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లలో వెనుకబడ్డ, దళిత, ఆదివాసీలే అధికంగా ఉన్నారని కారవాన్‌ అనే మ్యాగజీన్‌లో కథనం రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘సీఆర్పీఎఫ్‌లో మేం అందరినీ భారతీయులుగానే పరిగణిస్తాం. ఇక్కడ ఎక్కువ, తక్కువలు ఉండవు.

కులం, మతం, రంగు, వంటి చెత్త విభజన మా రక్తంలోనే లేదు’ అని దినకరణ్‌ స్పష్టం చేశారు. ‘అమరులైన జవాన్లను అవమానించడం మానుకోవాలి. వారు అర్థంపర్థంలేని మీ రాతలు, కథనాలకు గణాంకాలు కాదు’ అని సదరు పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో దాడిని చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లలో 19 మంది ఓబీసీలు లేదా బీసీలు, ఏడుగురు ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, అగ్రకులాలకు చెందిన నలుగురు, ముగ్గురు జాట్‌ సిక్కులు, ఓ ముస్లిం, బెంగాలీ అగ్రకులానికి చెందిన మరొకరు ఉన్నట్లు కారవాన్‌ కథనాన్ని ప్రచురించింది. 

మరిన్ని వార్తలు