ఫేస్బుక్ హ్యాకర్స్తో జాగ్రత్త
అమ్మాయి ఫొటో ఎర వేసి మోసం
చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
బనశంకరి : మీ ఫేస్బుక్ అకౌంట్కు అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా ఒకే చేసే ముందు ఒక్క క్షణం ఆగండి, దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పెద్ద ముఠా ఈ–మెయిల్స్ను హ్యాక్ చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అందమైన అమ్యాయి ఫోటో చూసి కొంచెం ఆదమరిస్తే మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు మొత్తం ఖాళీ గ్యారెంటీ. తాజాగా సుప్రీంకోర్టు విశ్రాంత సీజెఆర్. ఎం.లోదా సహ, మరో విశ్రాంత న్యాయమూర్తి బీపీ.సింగ్ ఈ మెయిల్ హ్యాక్ చేసి రూ. లక్షల వంచనకు పాల్పడిన ఘటన నేపథ్యంలో సైబర్హ్యాకర్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
అందంతో బుట్టలో పడేస్తారు : హ్యాకర్లు అందమైన అమ్మాయిల ఫొటోలు అప్లోడ్ చేసి ఎవరి పేరుతోనే ఫేస్బుక్లో అకౌంట్ తెరిచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ స్వీకరించిన క్షణాల్లో మెసేజ్ ద్వారా హాయ్ అని సందేశం పంపించి మీ గురించి ఒక హై ప్రొఫైల్ సమాచారం పంచుకుని బుట్టలో పడేస్తారు. అనంతరం ఈ మెయిల్లో మీతో స్నేహం కొనసాగించాలి. అక్కడ పరస్పరం మీ గురించి పూర్తి సమాచారం రాబట్టడానికి కొన్ని ఫొటోలు అప్లోడ్ చేయాలని లేదా నేను మీ దేశానికి వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నానని దీని పట్ల మీతో చర్చించాలని ఈ–మెయిల్ ఇచ్చి మెయిల్ ద్వారా అడ్రస్, వివరాలు ఇచ్చి అదృశ్యమౌతారు. ఒక వేళ వారి ఇచ్చిన ఈ– మెయిల్ అడ్రస్కు మీ మొబైల్ నుంచి మెసేజ్ పంపించి సంప్రదిస్తే ఇ మెయిల్ అకౌంట్ హ్యాక్ చేస్తారు. ఆధార్ నెంబరు నుంచి మొదలు బ్యాంక్ అకౌంట్ వరకు మీ వ్యక్తిగత సమాచారం సులభంగా హ్యాకర్లు చేతుల్లోకి వెళుతుంది. ఇలాంటి ముఠా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇలాంటి మెసేజ్ పట్ల పట్టించుకోరాదని అని సైబర్ క్రైంపోలీసులు హెచ్చరిస్తున్నారు.
భద్రత లేని వ్యాలెట్..
పేటీఎం, ఫోన్పే, గూగల్పే, అమెజాన్పేతో పాటు పలు మొబైల వ్యాలెట్లు ఉన్నాయి. ఈ కంపెనీలు సైతం కస్టమర్లును నేరుగా సంప్రదించి కేవైసీ పూర్తి వివరాలు సేకరించదు. దీనికి బదులు కస్టమర్లు బ్యాంకులకు అందించే ఆధార్కార్డు నెంబర్, ఇతర సమాచారం వినియోగించుకుని సేవలు అందిస్తాయి. గూగల్ యాప్నకు వెళ్లి మొబైల్ వ్యాలెట్కు సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని అతను, ఆమె మొబైల్ నెంబర్ నమోదు చేస్తే చాలు ఆధార్ నెంబర్ నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు పూర్తి సమాచారం లభిస్తుంది.
ఏవిధంగా వంచనకు పాల్పడతారంటే....
♦ కష్టాల్లో చిక్కుకున్నాం అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది అంటూ మిమ్మల్ని సంప్రదించే వారు మెయిల్ పంపించి వంచన
♦ అశ్లీల మెసేజ్ లేదా వీడియో పంపించి దానిని ప్రసారం చేస్తామని డబ్బుకోసం బ్లాక్మెయిల్ చేసే అవకాశం
♦ కంపెనీ వ్యవహారాలకు సంబందించి కస్టమర్లు, లేదా సహభాగస్వామ్యం కలిగిన కంపెనీలకు ఈ మెయిల్ పంపించి బాకీ ముందస్తు డబ్బు పేరుతో మోసం
♦ అన్ని అన్లైన్ కార్యక్రమాలకు ఈ మెయిల్ లింక్ ఉంటుంది నెట్ బ్యాంకింగ్ సమాచారం దొంగలించి బ్యాంక్ అకౌంట్కు కన్నం వేయవచ్చు.
♦ ఇతర ఈ మెయిల్ అకౌంట్లు, సోషల్మీడియా అకౌంట్లు సమాచారం సేకరించడం.
ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి
♦ గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఈ–మెయిల్ అడ్రస్కు మెసేజ్ పంపరాదు
♦ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ల్లో లింక్స్ను క్లిక్ చేయకండి
♦ హెచ్టీటీపీఎస్, యుఆర్ఎల్ వెబ్సైట్స్ తెరవరాదు
♦ ఐడీ, పాస్వర్డ్స్, ఓటీపీ, యుఆర్ఎస్ ఎవరికి ఇవ్వరాదు.
♦ గుర్తు తెలియని వ్యక్తుల ఇ మెయిల్, పాప్–ఆప్, ఎస్ఎంఎస్లకు ఎలాంటి కారణానికి స్పందించరాదు. హ్యాక్ చేసి వంచనకు పాల్పడే ముఠా ఉండవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ క్రైం సీనియర్ అధికారులు హెచ్చరించారు.