‘ఫొని’ అప్‌డేట్స్‌ : ఎల్లుండి తీరం దాటే అవకాశం

1 May, 2019 11:57 IST|Sakshi

భువనేశ్వర్‌ : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్‌పూర్‌-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 500 కి.మీ విస్తీర్ణంతో పూరీకి 680 కి.మీ, విశాఖకు 430 కి.మీ దూరంలో ఫొని కేంద్రీకృమై ఉందని ఐఎండీ తెలిపింది. భారీ తుపాను నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్‌ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గంటకు 22 కి.మీ వేగంతో కదులుతున్న ఫొని నేటి నుంచి దిశ మార్చుకుని పయనించే అవకాముందని ఐఎండీ అంచనా వేసింది. 
(చదవండి : ‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం)

ఫొని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు చేపట వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట బారువ తీర ప్రాంతం ఉంచి ఎర్రముక్కం వరకు అలల ఉధృతి పెరిగింది. తీరంలో 10 నుంచి 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలో 20 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, పశ్చిమ బంగలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతం వేడెక్కడం వల్లే ఈ ఫొని పెనుతుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది. 

అప్‌డేట్స్‌ :
తిత్లీని మించి..
ఫొని తుపాను తిత్లీ తుపాను కంటే ప్రమాదకరమైనదని ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్‌ హెచ్‌ బిశ్వాస్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై తిత్లీ విరుచుకుపడడంతో 60 మందికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఎంసీసీ ఎత్తివేత :
‘ఫొని’ సహాయక చర్యలకు ఆటంకాలు కలగకుండా ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ (ఎంసీసీ)ను ఎత్తేసింది.

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష :
ఫొని తుపాను సహాయక చర్యలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గండ్లు పడే చోట పునర్నిర్మాణం చేపట్టాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ సమీక్ష :
రేపు, ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా... భారీ ఉంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గంటలకు 100-120 కి.మీ వేంగంతో గాలులు వీచే అవకాశముంది. ‘ఫొని’తో అరటి, కొబ్బరి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం కలగనుంది. వీలైనంత త్వరగా కోతకోసి పంటలను భద్రపరచుకోవాలి. ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాం. అధికారుల సెలవున్నింటినీ రద్దు చేశాం. 6 వేల ఎలక్ట్రికల్‌ పోల్స్‌ సిద్ధంగా ఉంచాం. కమ్యునికేషన్‌ సిబ్బందిని కూడా అలర్ట్‌ చేశాం. 48 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం.

విశాఖ కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ సమీక్ష : 
ఫొని తుపాన్‌ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. రేపటి నుంచి 65 గ్రామాల్లో పునరావసం ఏర్పాటు చేస్తాం. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

మరిన్ని వార్తలు