అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దలైలామా

10 Apr, 2019 15:03 IST|Sakshi

ధర్మశాల: టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఛాతి సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ధర్మశాల నుంచి ఢిల్లీకి వచ్చిన దలైలామా మ్యాక్స్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతిలో ఇన్‌ఫెక‌్షన్‌ ఉన్నందువల్ల కొన్ని రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు.

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఢిల్లీలోనే ఏప్రిల్‌ 6న ముగిసిన గ్లోబల్‌ లెర్నింగ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న దలైలామా, సోమవారం ధర్మశాలకు వెళ్లారు. కానీ అనారోగ్యం కారణంగా మరుసటి రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. మొదటిసారిగా 1959లో దలైలామా భారత్‌కు వచ్చారు. టిబెట్‌, చైనా ఆక్రమణకు గురికావడంతో, తప్పించుకొని భారత్‌ చేరుకున్న దలైలామా అప్పటి నుంచి హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసం ఉంటున్నారు. బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ సాంప్రదాయానికి తనను తాను వారసుడిగా దలైలామా గతంలో ప్రకటించుకున్నారు. 

మరిన్ని వార్తలు