ఛత్తీస్గడ్: మధ్యప్రదేశ్లో అనాగరికమైన ఉదంతం చోటు చేసుకుంది. దళిత కులానికి చెందిన వరుడు గుర్రంపై ఊరేగిందుకు రాళ్ల దెబ్బలు తినాల్సి వచ్చింది. రాట్లం జిల్లాలోని మోగ్రూన్ గ్రామానికి చెందిన ఓ దళిత వరుడు గుర్రంపై ఊరేగడానికి వీల్లేదని కులపెద్దలు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా, అతడిపై రాళ్ల దాడికి దిగిన ఘటన స్థానికంగా ఆందోళనకు దారి తీసింది.
సాధారణంగా ఆయా కొన్ని కులాల, మత సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడు గుర్రంపై ఊరేగుతూ పెళ్లి మండపానికి తరలి వెళ్లడం ఆనవాయితీ. వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి అత్యంత ఉత్సాహంగా ఈ తంతు నడుస్తుంది. అయితే ఇక్కడ ఓ వరుడు మాత్రం ఎక్కడ నుంచి ఏ రాయి వచ్చి పడుతుందనే భయంతో బిక్కు బిక్కుమంటూ బరాత్కు బయలుదేరాడు. తలకు రక్షణగా హెల్మెట్ను ధరించి మరీ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు.
అయితే అడుగడుగునా అహంకారం మూర్తీభవించిన ఆధిపత్య కులపెద్దలు ఊరుకుంటారా.. దళిత కులానికి చెందిన వాడివి గుర్రంపై ఊరేగుతావా అంటూ రాళ్లతో దాడికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వరుడు.. పోలీసులు సమక్షంలో హెల్మెట్ పెట్టుకొని ఊరేగింపు కార్యక్రమాన్ని ముగించాడు. నవ నాగరికులం అని చెప్పుకుంటున్న నేటి సమాజంలో సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన పలువురిని విస్మయపరిచింది.