-

ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు

22 Apr, 2016 19:35 IST|Sakshi
బాధితురాలి ఆఫీస్ ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

ముక్త్సర్: ఓ ఆడబిడ్డని కీచకుడు నడిరోడ్డుపై చెరపట్టాడు. బలవంతంగా లాక్కెళ్లి కారులో కుదేసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై బలవంతంగా లాక్కుపోతున్నా ఏంటిది? అని ఎవ్వరూ అడగలేదు. విలవిలలాడిపోయిన ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా!

ముక్త్సర్ (పంజాబ్) నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తోన్న దళిత యువతిని ఆమె ఊరికే చెందిన ఓ వ్యక్తి ఆఫీసు నుంచి బయటికి ఈడ్చుకెళ్లాడు. 100 మీటర్ల దూరంలో నిలిపిన కారు దగ్గరికి గుంజుకెళ్లి, ఆమెను కారులో పడేశాడు. నిత్యం జనం సంచరించే మెయిన్ రోడ్డుపై వాడు తన పశుబలాన్ని ప్రదర్శిస్తుంటే అందరూ చూస్తూ నిల్చున్నారేతప్ప ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. కనీసం ఇదేంటని అడగలేదు. వాడు ఆమెను కారులో ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మార్చి 24న చోటుచేసుకున్న ఈ సంఘటనపై తర్వాతి రోజే బాధితురాలు ముక్త్సర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది.

నిందితుడు బాధిత యువతిని ఆమె ఆఫీసు నుంచి యువతిని లాక్కెళ్లిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకరిద్దరు కొలిగ్స్ కూడా వాంగ్మూలం ఇస్తామన్నారు. అయినాసరే పోలీసులు ఇంకా ఆ కీచకుణ్ని అరెస్ట్ చేయలేదు. దీంతో యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఇంత ఘోరం జరిగి, సాక్ష్యాధారాలున్నా నిందితుణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ కమిషన్ తాజాగా పోలీసులకు నోటీసులు  జారీచేసింది.

మరిన్ని వార్తలు