అక్కడ అదుపు తప్పితే అడ్రస్ పైలోకంలోనే

10 Jun, 2014 18:04 IST|Sakshi
అక్కడ అదుపు తప్పితే అడ్రస్ పైలోకంలోనే

ఉత్తర భారతదేశ యాత్రకు దేశం నలుమూల నుంచే గాక ఇతర దేశాల నుంచి సైతం నిత్యం యాత్రికులు వెళ్తుంటారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఉత్తరాదిన ఉండే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర, పుణ్యక్షేత్రాలతో కూడిన ఉత్తరాఖండ్ భూతల స్వర్గంగా పేరుగాంచితే.. బౌద్ధుల పుణ్యక్షేత్రం ధర్మశాల ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యాలకు మారు పేరు. అయితే ఈ రెండు రాష్ట్రాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్కు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయిన సంగతి తెలిసిందే. నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లో మంగళవారం బస్సు లోయలోకి పడిన సంఘటనలో 13 మంది రష్యన్లు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 30 మందికిపైగా మరణించారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో గత నెల 9న నదిలోకి బస్సు పడిన సంఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తే..

  • కొండలు, పక్కనే లోయలు, మధ్యన వంద మీటర్ల లోతున ప్రవహించే నదులతో కూడిన కొండ ప్రాంతాల్లో ఇరుకైన దారుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
  • ఒకప్పుడు నడకదారులే నేడు చాలా వరకు బస్సు మార్గాలు.
  • అందులోనూ భయంకరమైన మలుపులు, ఎలాంటి రక్షణ గోడలూ లేని దారిలో వెళ్లాల్సి ఉంటుంది.
  • అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మరింత ఆధ్వాన్నంగా మారుతుంటాయి.
  • ఈ ప్రాంతంలో బస్సు ప్రయాణమంటే ప్రయాణికులు గుండెను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి.
  • రహదారుల విస్తరణ, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఓ కారణం.
  • వర్షాకాలంలో అయితే ఘాట్ ప్రాంతాల్లో ప్రయాణించడం చాలా ప్రమాదకరం.
  • ఆధ్యాత్మిక భావన, ప్రకృతి రమణీయ దృశ్యాలతో యాత్ర మధురానుభూతులు మిగిల్చినా..
  • ఏ లోయలోనా, ఏ నదిలోనా పడకుంటా గమ్యస్థానం చేర్చాలని దేవుణ్ని ప్రార్థిస్తూ ప్రయాణించాల్సిందే.

మరిన్ని వార్తలు